ముంబై : మహారాష్ట్రలోని నవీముంబైలో ఎనిమిది నెలలుగా హోటల్లోని రెండు రూములు బుక్ చేసుకుని ఆపై రూ 25 లక్షల బిల్లుల బకాయిలు చెల్లించకుండా పరారైన వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది. మురళి కామత్ (43)గా గుర్తించిన నిందితుడు ఖర్గార్ ప్రాంతంలోని హోటల్ త్రీస్టార్లో రెండు రూములు తీసుకుని తన 12 ఏండ్ల కుమారుడితో కలిసి ఎనిమిది నెలుగా ఉంటున్నాడు. రూ 25 లక్షల బిల్లు చెల్లించకుండా ఆయన బాత్రూం కిటికీలోంచి దూకి పరారయ్యాడు. మురళి కామత్పై హోటల్ నిర్వాహకులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గత ఏడాది నవంబర్ 23న తొలుత కామత్ హోటల్క వచ్చాడు. తాను సినీ పరిశ్రమలో పనిచేస్తానని హోటల్ సిబ్బందికి చెప్పిన ఆయన హోటల్లో రెండు సూపర్ డీలక్స్ రూమ్లు బుక్ చేశాడు. ఓ రూంలో తాను ఉంటానని, మరో రూంలో తన పనికి సంబంధించిన సమావేశాలు జరుగుతాయని చెప్పాడు. నెల రోజుల తర్వాత డిపాజిట్ చెల్లిస్తానని, అందుకు తన పాస్పోర్ట్ను హామీగా పెడతానని చెప్పాడు.
ఈ ఏడాది మే వరకూ కామత్ ఎలాంటి చెల్లింపులు చేయలేదు. జులై 17న కామత్, తన కొడుకుతో పాటు బాత్రూం కిటికీ గుండా పారిపోయినట్టు హోటల్ సిబ్బంది గుర్తించారు. కామత్ తన ల్యాప్టాప్, మొబైల్ పోన్ను రూంలోనే వదిలివేసి వెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.