చెన్నై : ఆన్లైన్ రమ్మీకి బానిసై సర్వం కోల్పోయిన వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో వెలుగుచూసింది. బాధితుడిని ప్రభు (47) ఆన్లైన్ రమ్మీలో రూ 15 లక్షలు పోగొట్టుకోవడంతో పాటు కేరళ లాటరీలో మరో 3 లక్షలు నష్టపోయాడు.
పేకాట వ్యసనంతో ఇంటిని కూడా అమ్మిన ప్రభు అడ్వాన్స్గా చేతికొచ్చిన డబ్బును సైతం ఆన్లైన్ రమ్మీలో కోల్పోయాడని అతడి బంధువులు తెలిపారు. ప్రభుకు భార్య ఇద్దరు పిల్లలున్నారు. గత మూడేండ్లుగా తమిళనాడులో ఆన్లైన్ రమ్మీలో సర్వం కోల్పోయి 17 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ఆన్లైన్ గేమింగ్ను రద్దు చేయాలని జస్టిస్ చంద్రు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ కూడా ప్రభుత్వానికి సూచించింది. గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ను రద్దు చేస్తూ చట్టం తీసుకువచ్చినా మద్రాస్ హైకోర్టు దాన్ని రద్దు చేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్ధానం పరిధిలో ఉందని అధికారులు తెలిపారు.