న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతంలో శనివారం విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న మహిళను తోటి ఉద్యోగి తీవ్ర వేధింపులకు గురిచేసి ఉసురుతీశాడు. చాంద్గా గుర్తించిన నిందితుడు మహిళను రోడ్డుపై నుంచి సమీప రైల్వే గోడౌన్లోకి తీసుకువెళ్లి కత్తెరతో కసితీరా పొడిచాడు. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత మహిళ నిందితుడితో పాటు ఒకే దుస్తుల ఫ్యాక్టరీలో పనిచేస్తుండేది.
రోడ్డుపై మహిళను నిందితుడు వేధింపులకు గురిచేసి రైల్వే గోడౌన్కు గుంజుకెళ్లినా స్ధానికులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించారు. మహిళ బ్యాగ్లో ఉన్న కత్తెరతోనే బాధితురాలి మెడపై 8-10 సార్లు పొడిచాడని పోలీసులు గుర్తించరు. మహిళ ఎంతసేపటికీ ఇంటికీ రాకపోవడంతో ఆదివారం ఉదయం ఆమె భర్త, కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
గాలింపు చర్యల్లో భాగంగా గోడౌన్లో మహిళ మృతదేహం కనిపించడం, సీసీటీవీ ఫుటేజ్లో నిందితుడు చాంద్ అక్కడ కనిపించడంతో హత్య కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. మహిళ తనను మోసం చేసిందనే కోపంతోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టానని నిందితుడు పేర్కొన్నాడని పోలీసులు చెప్పారు.