ఏదైనా పాపం చేస్తే నరకానికి వెళ్లాక శిక్ష అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కానీ.. ఈ కలియుగంలో తప్పు చేసిన వాళ్లను నరకానికి వెళ్లకముందే.. భూమి మీదనే నరకం చూపిస్తున్నారు జనాలు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి మధ్య ప్రదేశ్లో చోటు చేసుకుంది.
45 ఏళ్ల ఓ వ్యక్తిని ట్రక్కుకు కట్టేసి.. రోడ్డు మీద ఈడ్చుకెళ్లి.. చిత్రహింసలు పెట్టి చంపేశారు కొందరు. మధ్యప్రదేశ్లోని నీముచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ వ్యక్తిని దొంగగా భావించి.. పట్టుకొని కొందరు వ్యక్తులు కలిసి చితక్కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి దొంగ దొరికాడని.. వచ్చి తీసుకెళ్లాలని చెప్పారు. పోలీసులు వచ్చే లోపే.. ట్రక్కుకు అతడి కాళ్లను కట్టేసి.. చిత్రహింసలు పెట్టి.. ట్రక్కుతో రోడ్డు మీద ఈడ్చుకెళ్లి.. రోడ్డు మీదనే అలాగే అతడిని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పోలీసులు అక్కడికి వెళ్లి చూసేసరికి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు ఆ వ్యక్తి. వెంటనే అతడిని నీముచ్ జిల్లా ఆసుపత్రికి తరలించినా.. ఫలితం దక్కలేదు. అతడు చనిపోయాడు.
అతడిని ట్రక్కుకు కట్టి.. ఈడ్చుకెళ్తుంటే.. కొందరు వీడియో తీసి.. దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది.
ఆ వ్యక్తిని కన్హియా భీల్గా పోలీసులు గుర్తించారు. అతడి బనాడా గ్రామం అని తెలిపారు. ఆ వ్యక్తిని చిత్రహింసలకు గురి చేసి చంపేసిన నిందితులను గుర్తించిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ద్వారా పోలీసులు.. నిందితులను గుర్తించి.. అరెస్ట్ చేశారు.