అహ్మదాబాద్: ఆస్తి వాటాలో వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తి తన సోదరిని కత్తితో పొడిచి హత్య చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తండ్రి, మేనల్లుడిపై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ సంఘటన జరిగింది. మహేంద్ర సిన్హా చావ్డా అనే వ్యక్తి శనివారం రాత్రి రామోల్ ప్రాంతం కృష్ణకుంజ్ సొసైటీలోని సోదరి మన్హర్బా ఇంట్లోకి చొరబడ్డాడు. తండ్రి, మేనల్లుడితో కలిసి ఆరు బయట నిద్రిస్తున్న ఆమెను కత్తితో పొడిచాడు. అరుపులకు మేల్కొని అడ్డుకోబోయిన తండ్రి, మేనల్లుడిపై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, తండ్రి షైతాన్ సిన్హా చావ్డా పోలీసులకు ఫోన్ చేశాడు. ఆ ముగ్గుర్ని ఆసుపత్రికి తరలించగా మన్హర్బా మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడి మొబైల్ ఫోన్ ఆధారంగా అతడు ఎక్కడ ఉన్నాడో అన్నది గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని ప్రశ్నించగా ఇంటి ఆస్తిలో సోదరికి వాటా ఇవ్వడం ఇష్టం లేక ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.