అమరావతి : ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో బాబాయితో గొడవకు దిగిన యువకుడు విచక్షణ కోల్పోయి మద్యం సీసాతో పొడిచి హతమార్చాడు. కొనకనమిట్ల మండలం పెదారికట్ల గ్రామంలో ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పెదారికట్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అతడి అన్న కుమారుడు పుల్లారావు ఓ దుకాణం వద్ద మద్యం సేవించేందుకు వెళ్లారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన పుల్లారావు బాబాయి వెంకటేశ్వరరావును మద్యం సీసాతో పొడిచి పాశవికంగా హతమార్చాడు. హత్యకు ఆస్తి వివాదమే కారణమని తెలుస్తున్నది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.