ముంబై : మహారాష్ట్రలో దారుణం జరిగింది. విడిగా ఉంటోందనే కోపంతో భార్యపై యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడు సురేష్ జింగ్రీ, ఆయన భార్య నెల రోజులుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ వేరుపడాలని భార్య నిర్ణయించుకుంది. భార్య నిర్ణయంతో ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు.
నాగపూర్లోని రామేశ్వరి ప్రాంతంలో శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాలిన గాయాలతో బాధిత మహిళ చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరింది. యాసిడ్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించి పరీక్షిస్తున్నామని జోనల్ డీసీపీ నూరుల్ హసన్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
మరోవైపు కోయంబత్తూర్లో ఇటీవల 27 ఏండ్ల మహిళ తన బాయ్ఫ్రెండ్పై యాసిడ్ దాడికి పాల్పడి కత్తిపోట్లకు గురిచేసి ఆత్మహత్యాయత్నం చేపట్టిన ఘటన కలకలం రేపింది. పెండ్లి ప్రతిపాదనను బాయ్ఫ్రెండ్ రాకేష్ వ్యతిరేకించడంతో నిందితురాలు జయంతి ఈ దారుణానికి పాల్పడింది. రాకేష్పై యాసిడ్ దాడికి పాల్పడి కత్తిపోట్లకు గురిచేసి ఆపై తాను విషం తాగి బలవన్మరణానికి ప్రయత్నించగా ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారు. రాకేష్ ఫిర్యాదు ఆధారంగా జయంతిపై కేసు నమోదు చేసిన పోలీసులు రాకేష్పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.