చెన్నై : భార్య పొరుగున ఉండే పురుషులతో తరచూ మాట్లాడుతోందని అనుమానం పెంచుకుని ఆమెకు నిప్పంటించిన వ్యక్తి ఉదంతం చెన్నైలోని నంగనల్లూర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి వెలుగుచూసింది. పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకోగానే బాధితురాలి (28) పక్కన పదినెలల చిన్నారి కూర్చుని ఉంది. తీవ్ర గాయాలతో స్ప్రహ కోల్పోయి రక్తపు మడుగులో ఉన్న మహిళను పోలీసులు కాపాడారు.
కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు. బాధితురాలిని వినితగా గుర్తించిన పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా ఆమె పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడు కమల్ కణ్ణన్ ఇంటికి అతడి యజమాని వెళ్లిన క్రమంలో ఈ దారుణం వెలుగుచూసింది.
ఫ్లోర్ మిల్లు యజమాని వితీశ్వరన్ కణ్ణన్ కోసం గాలిస్తూ అతడి ఇంటికి వెళ్లగా బాధితురాలు స్ప్రహలేకుండా పడిఉండటం కంటపడింది. వితీశ్వరన్ పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగుచూసింది. మహిళ మెడపై గాయాల ఆనవాళ్లు కనిపించగా, ఆమె తలపై నిందితుడు మద్యం బాటిల్తో దాడి చేశాడని పోలీసులు చెప్పారు. బాధితురాలికి నిప్పంటించేందుకు నిందితుడు ప్రయత్నించే క్రమంలో ఆమె శరీర భాగాలపై గాయాలయ్యాయని తెలిపారు.