హయత్నగర్ : జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో యువతను టార్గెట్ చేస్తూ గంజాయి సరఫరా చేస్తున్న ఓ డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద రూ.10 వేలు విలువైన 75 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఈ మేరకు వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పురుషోత్తంరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన సంతోష్రాయ్(34), నగ రానికి వలసొచ్చి అబ్దుల్లాపూర్మెట్ మండలం, ఇంజాపూర్ గ్రామంలో కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నారు.
సంతోష్ రాయ్ మస్కతి డెయిరీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. డ్రైవర్గా వచ్చే వేతనం సరిపోకపోవడంతో ఈజీగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో తుర్కయాంజాల్లోని ఓ టీస్టాల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తితో పరిచయమై గంజాయి ప్యాకెట్లను ఒక్కోటి రూ.100 చొప్పున తక్కువ ధరకు అతని వద్ద కొనుగోలు చేసి యువతను టార్గెట్ చేస్తూ అధిక ధరకు విక్రయిస్తు న్నాడు. పక్కా సమచారం అందుకున్న వనస్థలిపురం పోలీసులు సంతోష్ రాయ్ను అరెస్టు చేసి అతని వద్ద గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి సరఫరా చేస్తున్న డ్రైవర్ను పట్టుకున్న ఏఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, కానిస్టేబుల్ కె.బాబు చారి, జి.బాలరాజు, ఎ.కృష్ణ, ఎం.లక్కికిరణ్, జి.ఉపేందర్, బి.జగన్, యూనుస్, ఎ.సుభాష్ చంద్రబోస్ లను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జి.జగన్నాథ్, సిబ్బంది పాల్గొన్నారు.