Crime News | ఢిల్లీలోని ఓ మెట్రో రైల్వే స్టేషన్లో ఒక మహిళ ముంగిట అశ్లీల హవభావాలు ప్రదర్శించిన 23 ఏండ్ల యువకుడ్ని అరెస్ట్ చేశామని ఢిల్లీ పోలీసులు గురువారం తెలిపారు. నిందితుడి పేరు శివం శర్మ అని.. అతడు బీ ఫార్మసీ పూర్తి చేసి, ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
మెట్రో రైలులో తుగ్లకాబాద్ మెట్రో స్టేషన్ నుంచి మండీ హౌస్ మెట్రో స్టేషన్కు చేరుకున్న ఓ మహిళ.. ఫ్లాట్ ఫామ్ నంబర్-1 వద్ద తన స్నేహితురాలి కోసం వేచి చూస్తున్నారు. ఎదురుగా ఉన్న ప్లాట్ ఫామ్ వద్ద సదరు నిందితుడు అశ్లీల హవభావాలు ప్రదర్శిస్తున్న సంగతి గమనించి మహిళ.. సీఐఎస్ఎఫ్ అధికారికి ఫిర్యాదు చేసింది.
మహిళ ఫిర్యాదుపై స్పందించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఎదురు ప్లాట్ ఫామ్ పైకి వస్తుండగానే నిందితుడు మెట్రో రైలు ఎక్కి పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడ్ని బాధితురాలు గుర్తించింది. నిందితుడి ఫొటోలు డెవలప్ చేశారు.. సదరు వ్యక్తి నంగ్లీ మెట్రో స్టేషన్ వద్ద రైలు దిగి వెళ్లి పోయాడని తేల్చుకున్నారు.
బేగంపూర్లోని రాజీవ్ నగర్ లో ఆ వ్యక్తి నివాసం ఉంటున్నాడని తెలుసుకున్నామని డీసీపీ (మెట్రో) జీ రాం గోపాల్ నాయక్ తెలిపారు. అడ్రస్ తెలుసుకుని అతడ్ని అరెస్ట్ చేశామని తెలిపారు. మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్న వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) అధికార ప్రతినిధి తెలిపారు.