టిక్ టాక్ కోసం సరదాగా వీడియో చేయబోయి ఒక యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒక వైన్ షాపు వద్ద ఒక యువకుడు తుపాకీ పట్టుకొని టిక్ టాక్ వీడియో చేయబోయాడు. కానీ ఆ సమయంలో పొరపాటున ఆ తుపాకీ పేలడంతో ఎదరుగా ఉన్న వ్యక్తి బుల్లెట్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఇందోర్ నగరంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని ఇందోర్ నగరంలో పరదేశి పురా ప్రాంతంలో ఒక వైన్ షాపులో సుశీల్, మనీష్ అనే ఇద్దరు యువకులు పనిచేస్తున్నారు. వారిద్దరూ కలిసి ఏదైనా టిక్ టాక్ వీడియో చేయాలనుకున్నారు. ఆ వీడియోలో తుపాకీ అవసరం ఉండడంతో తెలిసిన ఒక సెక్యూరిటీ గార్డు మిత్రుడి వద్ద తుపాకీ తీసుకున్నారు. ఆ తరువాత వైన్ షాపు వద్ద ఉదయాన్నే వీడియో తీయడం ప్రారంభించారు. కానీ తుపాకీ లోడెడ్ ఉందని గమనించక మనీష్ దాని ట్రిగర్ నొక్కాడు.. అంతే ఎదురుగా ఉన్న సుశీల్ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఇది చూసి కంగారు పడిన మనీష్.. సుశీల్ను లేపడానికి ఎంత ప్రయత్నించినా లేవకపోవడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. సుశీల్ అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారు.
పోలీసులు మనీష్ని అరెస్టు చేసి.. తుపాకీ పొరపాటున పేలిందా లేక మనీష్ కావాలనే సుశీల్ని హత్య చేశాడా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. దర్యాప్తు కోసం పోలీసులు ప్రస్తుతం వైన్ షాపుని సీజ్ చేశారు.
ఇంతకుముందు కూడా ఇలాగే టిక్ టాక్ వీడియో కోసం ఒక అమ్మాయి ఉరేసుకుంటున్నట్లు యాక్టింగ్ చేయబోగా.. నిజంగానే ఆమె మెడకు ఉరిబిగుసుకొని చనిపోయింది.