ముంబై : ఒకమ్మాయి పెట్టిన వాట్సాప్ స్టేటస్ తన తల్లి ప్రాణాలను బలిగొన్నది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఫిబ్రవరి 10న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. శివాజీనగర్ ఏరియాకు చెందిన ప్రీతి ప్రసాద్(20) అనే యువతి వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంది. అయితే ఆమె పెట్టుకున్న స్టేటస్.. పొరుగున ఉండే 17 ఏండ్ల అమ్మాయికి నచ్చలేదు.
దీంతో ఆమెతో పాటు తల్లి, సోదరుడు.. ప్రీతి ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగారు. ఈ ఘర్షణలో ప్రీతి తల్లి లీలావతి దేవీకి తీవ్ర గాయాలయ్యాయి. పక్కటెముకలు విరిగాయి. బాధితురాలు చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లీలావతి మృతి కేసులో ఇద్దరు మహిళలతో పాటు మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.