భోపాల్: మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. చేసిన పనికి కూలీ డబ్బులు అడిగి తెచ్చుకునేందుకు వెళ్తే.. అతనికి పని ఇచ్చిన వ్యక్తి అత్యంత పాశవికంగా చేతిని తెగనరికాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లా సిర్మౌర్ పోలీస్స్టేషన్ పరిధిలో డోల్మౌ గ్రామంలో నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన అశోక్ సాకేత్ (45) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఇటీవల గణేశ్ మిశ్రా అనే కాంట్రాక్టర్ దగ్గర భవన నిర్మాణ పనులు చేశాడు. ఆ పనులకు సంబంధించి కొంత డబ్బు ఇచ్చినప్పటికీ మరికొన్ని పెండింగ్ కూళ్లు రావాల్సి ఉంది. చాలారోజులుగా అడుగుతున్నా గణేశ్ మిశ్రా పెండింగ్ కూళ్లు ఇవ్వడంలేదు. దాంతో గత శనివారం కూడా కూలీ డబ్బుల కోసం వెళ్లిన అశోక్ సాకేత్.. గణేశ్ మిశ్రాను గట్టిగా నిలదీశాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.
దాంతో ఆగ్రహానికి లోనైన గణేశ్మిశ్రా తన దగ్గరున్న పదునైన ఆయుధంతో అశోక్ సాకేత్ చేతిని తెగనరికేశాడు. దాంతో భయపడి అక్కడి నుంచి తప్పించుకున్న అశోక్ సాకేత్ సిర్మౌర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించి.. ఘటనా స్థలం వద్ద తెగిపడి ఉన్న చేతిని తీసుకెళ్లారు. అయితే, అప్పటికే రెండు గంటలు ఆలస్యం కావడంతో చేతిని అతికించడం సాధ్యం కాదని వైద్యులు తెలిపారు.
భాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు గణేశ్ మిశ్రాను అరెస్ట్ చేశారు. గణేశ్ మిశ్రాతోపాటు ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న అతని సోదరులు రత్నేశ్ మిశ్రా, క్రిష్ణ మిశ్రాలను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ముగ్గురిపైనా ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు.