LPG booking : భార్య హత్య కేసులో నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఒక ఆర్మీ మాజీ ఆఫీసర్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ చేసి, పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. అతడిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలివి. పంజాబ్కు చెందిన సందీప్ తోమర్ ఇండియన్ ఆర్మీలో కెప్టెన్గా పని చేసేవాడు. అయితే, 2013లో అతడు తన భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.
కానీ, పోలీసుల విచారణలో అతడు భార్యను హత్య చేసినట్లు తేలింది. హత్య కేసులో నిందితుడిగా ఉండటంతో అతడిని ఇండియన్ ఆర్మీ విధుల నుంచి తొలగించింది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు సందీప్ తోమర్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో 2014 నుంచి అతడు జైలు శిక్ష అనుభవించాడు. చివరకు 2019లో అతడికి బెయిల్ లభించింది. ఇదే సమయంలో తనకు విధించిన శిక్షను సవాలు చేస్తూ అతడు పంజాబ్, హరియాణా హైకోర్టును ఆశ్రయించాడు. చివరకు కోర్టు కూడా 2022 సెప్టెంబర్లో అతడి యావజ్జీవ కారాగార శిక్షను సమర్ధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు అనంతరం సందీప్ జైలులో లొంగిపోవాల్సి ఉంది. కానీ, అప్పటినుంచి అతడు తప్పించుకు తిరుగుతున్నాడు. నాలుగేళ్లుగా పరారీలో ఉన్నాడు. దీంతో అతడి భార్య తండ్రి కోర్టును ఆశ్రయించాడు. సందీప్ను త్వరగా అరెస్టు చేసేలా ఆదేశించమని కోర్టును కోరాడు. విచారణ జరిపిన కోర్టు అతడిని త్వరగా అరెస్టు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో పోలీసులు అతడి కోసం ప్రత్యేక బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
సందీప్ను పట్టుకునేందుకు వారు నాలుగేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అతడి పాన్ కార్డ్, ఆధార్ కార్యకలాపాలపై నిఘా పెట్టారు. పాన్ ద్వారా ఒక ప్రైవేటు బ్యాంకులో అకౌంట్ తీసుకున్నాడు. ఆ అకౌంట్లో శాలరీ కూడా క్రెడిట్ అయ్యేది. కానీ, దీని ఆధారంగా కూడా అతడి ఆచూకీ కనుక్కోలేకపోయారు. అతడు తరచూ అడ్రస్లు మారుస్తుండటంతో వీలుకాలేదు. కానీ, ఇటీవల ఆధార్, పాన్ ద్వారా ఒక సిలిండర్ బుక్ చేసుకుని, దానికి డబ్బులు కూడా చెల్లించాడు. దీంతో అతడు మధ్యప్రదేశ్లో ఉన్నట్లు తేలింది. అక్కడ అతడికి సిలిండర్ అందించిన గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి, వారి ద్వారా అతడి ఆచూకీ కనుక్కున్నారు. ప్రస్తుతం పోలీసులు సందీప్ను మధ్య ప్రదేశ్ నుంచి పంజాబ్ తరలించారు. కోర్టులో హాజరుపర్చనున్నారు.