వికారాబాద్ : వారిద్దరు చిన్నప్పట్నుంచి కలిసే చదువుకున్నారు.. ఒకరి ఇష్టాలు ఒకరికి బాగా తెలుసు. ఒకరికొకరు అర్థం చేసుకున్నారు. అలా ఆ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రేమించుకున్నారు. ఇక కలిసి జీవించాలనుకున్నారు. కానీ వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోరని భావించి, ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లా నవపేట్ మండలం కడిచర్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది.
కడిచర్ల గ్రామానికి చెందిన పల్లె పవన్ కుమార్(18) ఇంటర్ చదువుతున్నాడు. తనతో పాటు చిన్నప్పట్నుంచి కలిసి చదువుకున్న ఓ అమ్మాయిని పవన్ ప్రేమిస్తున్నాడు. ఈ విషయం ఇరు కుటుంబాల సభ్యులకు తెలిసింది. అయితే తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరేమోనని భావించిన ఆ ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆత్మహత్య ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.