భద్రాద్రి కొత్తగూడెం : వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కానీ యువతికి మరొకరితో వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియురాలు.. తన ప్రియుడితో కలిసి పురుగుల మందు సేవించి, ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ముల్కలపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో వెలుగు చూసింది.
మృతుల కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తురకలగూడేనికి చెందిన మడకం సోనా(20), దేవీ(18) అనే యువతిని గత కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నాడు. దేవీ ముల్కలపల్లి మండల పరిధిలోని ధర్మన్ననగర్ వాసి. అయితే వీరిద్దరూ సమీప బంధువులు కూడా. అయితే దేవీకి ఇటీవలే పెళ్లి సంబంధం కుదిర్చారు. దీంతో మనస్తాపం చెందిన యువతి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది. సోమవారం రాత్రి అన్నారం శివారు అటవీ ప్రాంతంలో గ్రామస్తులు రెండు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులను ఇంటి నుంచి అదృశ్యమైన దేవీ, ఆమె ప్రియుడు సోనాగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలిలో ఉన్న పురుగుల మందు డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను పాల్వంచ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.