లక్నో : ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్ధం కావడంతో ఆగ్రహంతో ఆమెపై దాడికి పాల్పడిన అనంతరం వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన యూపీలోని లోని ప్రాంతంలో వెలుగుచూసింది. తన కూతురి వివాహం ఖరారు కాగా నిందితుడు కోపంతో ఆమెపై దాడి చేశాడని బాధితురాలి తండ్రి వెల్లడించారు. బాధితురాలు, నిందితుడు లోని ప్రాంతంలో నివసిస్తున్నారు.
దాడికి గురైన యువతి (22)ని చికిత్స నిమిత్తం ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రికి తరలించి ఆపై మ్యాక్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాధితురాలు కార్యాలయానికి వెళుతుండగా ఢిల్లీలోని మీట్ నగర్ ప్రాంతంలో నిందితుడు ఆమె తలపై సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై జ్యోతి నగర్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
తమ కూతురి వివాహం దీపక్ అనే వ్యక్తితో ఖరారైందని, అయితే తమ పొరుగింటి వ్యక్తి ఆమెను పెండ్లి చేసుకోవాలనుకున్నాడని..వేరొకరితో నిశ్చితార్ధం జరగడంతో ఆమె తలపై పదునైన ఆయుధంతో దాడి చేశాడని బాధితురాలి తండ్రి తెలిపారు. బాధితురాలిపై దాడి చేసిన అనంతరం నిందితుడు లోని ప్రాంతంలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్టు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. అతడి మృతదేహాన్ని జీటీబీ ఆస్పత్రికి తీసుకువచ్చారు.