బెంగళూర్ : మైనర్ బాలికలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న లింగాయత్ సన్యాసి, మఠాధిపతి శివమూర్తి మురుగపై కర్నాటక పోలీసులు గురువారం లుక్అవుట్ నోటీసు జారీ చేశారు. మఠం నిర్వహిస్తున్న విద్యా సంస్ధలో చదువుతున్న ఇద్దరు మైనర్ బాలికలపై శివమూర్తి మురుగ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. నిందితుడు దేశం దాటి పోకుండా ముందు జాగ్రత్త చర్యగా లుక్అవుట్ నోటీస్, సర్క్యులర్ (ఎల్ఓసీ)ను కర్నాటక పోలీసులు జారీ చేశారు.
అంతర్జాతీయ విమానాశ్రయాలు, సీపోర్ట్స్ వంటి అన్ని ఇమిగ్రేషన్ చెక్పాయింట్స్కు నిందితుడిపై నోటీసులను జారీ చేశారు. ఇద్దరు మైనర్ బాలికల తరపున అందిన ఫిర్యాదు ఆధారంగా శివమూర్తి మురుగపై మైసూర్ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. సన్యాసి శివమూర్తి మురుగపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూల్లో చదువుతున్న 15, 16 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు బాలికలను శివమూర్తి మురుగ గత మూడున్నరేండ్లుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు.
సన్యాసి చేష్టలతో విసిగిన బాలికలు జూన్ 24న హాస్టల్ నుంచి పారిపోయి మరుసటి రోజు కాటన్పేట్ పోలీస్స్టేషన్లో నిందితుడిపై ఫిర్యాదు చేశారు. బాలికల ఫిర్యాదు ఆధారంగా శివమూర్తి మురుగను పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని శివమూర్తి మురుగ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.