మహబూబ్నగర్ : బంగారు, వెండి ఆభరణాలకోసం అమాయక మహిళను మాయమాటలతో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి 27 మంది మహిళలను హతమార్చిన నరహంతకుడికి గద్వాల మూడవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జీవితఖైదు విధించారు.
ఎస్సై భగవంత్రెడ్డి కథనం మేరకు.. బాలానగర్ మండలం గుండేడ్కు చెందిన ఎరుకలి శ్రీనివాసులు కొన్నేండ్లుగా జిల్లా కేంద్రంలోని శివశక్తినగర్లో నివాసం ఉంటున్నాడు. 2019 డిసెంబర్ 17న నవాబ్పేట మండలం కూచూరుకు చెందిన చిట్టి అలివేల(54)ను మహబూబ్నగర్ టీడీగుట్ట కల్లు దుకాణం వద్ద పరిచయం చేసుకున్నాడు. ఆమెకు మాయమాటలు చెప్పి దేవరకద్ర మండలం డోకూర్ గ్రామశివారులోకి తీసుకొచ్చి హతమార్చి ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసుకెళ్లాడు.
ఈ మేరకు దేవరకద్ర పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా, రిమాండ్కు తరలించారు. నిందితుడికి 17 హత్య కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు ఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాలమేరకు సీఐ రజితారెడ్డి, ఎస్సై భగవంత్రెడ్డి సిబ్బంది సహకారంతో కోర్టులో సాక్ష్యాలను ప్రవేశపెట్టారు. వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడు ఎరుకలి శ్రీనివాసులుకు న్యాయమూర్తి శివకుమార్ జీవితఖైదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని ఎస్సై తెలిపారు.