రంగారెడ్డి : చిరుత సంచారంతో యాచారం మండలంలోని తాటిపర్తి గ్రామం వణికిపోతోంది. మూగజీవాలపై చిరుత వరుస దాడులకు పాల్పడుతూ స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది. మూడు రోజుల వ్యవధిలోనే నాలుగు మూగజీవాలను పొట్టన పెట్టుకుంది చిరుత.
మంగళవారం రాత్రి తాటిపర్తి గ్రామానికి చెందిన నక్క జంగయ్య మేకల మందపై చిరుత విరుచుకుపడింది. ఓ మేకపోతును చంపేసింది. సోమవారం రాత్రి దొడ్డి యాదయ్యకు చెందిన ఆవుపై దాడి చేసి చంపింది. ఆవు శరీరాన్ని చిరుత ఘోరంగా చిదిమేసింది. అంతకు ముందు రోజు అంజయ్యకు చెందిన రెండు లేగదూడలను పొట్టన పెట్టుకుంది. ఇలా మూడు రోజుల వ్యవధిలోనే నాలుగు మూగజీవాలను బలి తీసుకున్నది చిరుత. మూగజీవాలపై చిరుత వరుస దాడులకు పాల్పడుతుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి కడప దాటి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పశువులను మేపేందుకు అడవికి వెళ్లాలంటే వణికిపోతున్నారు.
తాటిపర్తి గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్న చిరుతను బంధించేందుకు అటవీ అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నిఖిల్ కుమార్ రెడ్డి, సెక్షన్ ఆఫీసర్ విజయ్ భాస్కర్ రెడ్డి నేతృత్వంలో చిరుతను పట్టుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. అడవి మధ్యలో బోన్లను కూడా అందుబాటులో ఉంచారు. చిరుత ఆనవాళ్లను గుర్తించేందుకు తాటిపర్తి పరిసరాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అటు బోన్లకు, ఇటు సీసీ కెమెరాలకు చిక్కకుండా చిరుత తప్పించుకు తిరుగుతోంది. దీంతో ఫారెస్టు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.