చండీగఢ్: కొందరు వ్యక్తులు ఒక కార్మికుడి వెంటపడి కత్తులతో పొడిచి హత్య చేశారు. పంజాబ్లోని మోగా జిల్లాలో ఈ దారుణం జరిగింది. శుక్రవారం బధ్ని కలాన్ ప్రాంతంలోని మార్కెట్కు వచ్చిన 28 ఏళ్ల దేశరాజ్ను బైక్లపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు వెంబడించారు. పొడవైన కత్తులు చేతపట్టిన వారు వాటితో అతడిపై దాడి చేశారు. మెడ, ముఖం, పాదాలపై కత్తులతో పొడిచి అక్కడి నుంచి పారిపోయారు. ఇది చూసి స్థానికులంతా భీతిల్లారు. తీవ్రంగా గాయపడిన కార్మికుడు దేశరాజ్ను అక్కడి కార్మికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, కొన్ని రోజుల కిందట ఒక చిన్న ఘర్షణ జరిగిందని, దీనిపై కక్ష పెంచుకున్న నిందితులు దేశరాజ్ను హత్య చేశారని హతుడి కుటుంబం ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోను స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుఖపాల్ సింగ్ ఖైరా తన ట్విట్టర్లో షేర్ చేశారు. పంజాబ్లో శాంతి భద్రతలు దిగజారుతుండటం విచారకరమని అన్నారు. సిక్కులు లైసెన్స్ పొందిన ఆయుధాలు కలిగి ఉండాలని జతేదార్ అకల్ తఖత్ చేసిన ప్రకటన సరైనదేనని తాను ఇప్పుడు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆప్ సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడలేకపోతోందని విమర్శించారు.
If this news of broad daylight murder in Moga is true its heart rending! I’m saddened by this deteriorating law & order of Punjab. I now feel the statement by Jathedar Akal Takhat urging sikhs to have licensed weapons is correct as @BhagwantMann govt seems unable to protect lives https://t.co/bhDJnDMcAj
— Sukhpal Singh Khaira (@SukhpalKhaira) June 4, 2022