అతిపెద్ద ధర్మాస్పత్రిగా విశేష సేవలందిస్తున్న ఉస్మానియా ప్రభుత్వ దవాఖానలో శస్త్రచికిత్సలు వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో, ఆర్థో విభాగాలకు మూడు ఆపరేషన్ థియేటర్లు మాత్రమే ఉన్నాయి. నగరంతోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి అత్యవసర కేసులు వచ్చినప్పుడు ఆపరేషన్లు త్వరగా నిర్వహించడంలో ఇబ్బందులు తలెత్తేవి. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర వైద్య సదుపాయాల మౌలిక అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఐడీసీ) దవాఖాన ప్రాంగణంలోని భవనంలో ఏడు నూతన ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేసింది. పాతవి, కొత్తవి కలుపుకొని పది థియేటర్లు అందుబాటులోకి రాగా, నిత్యం 30 వరకు శస్త్రచికిత్సలు జరగనున్నాయి. నూతన ఆపరేషన్ థియేటర్లను బుధవారం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాలకు సంబంధించి నిత్యం పదుల సంఖ్యలో కేసులు వస్తుంటాయని, నూతన థియేటర్లు అందుబాటులోకి రావడంతో శస్త్రచికిత్సలకు నిరీక్షణ ఉండదని ఆయన చెప్పారు. అత్యాధునిక వైద్య పరికరాల కోసం ప్రభుత్వం రూ.17.70 కోట్లు మంజూరు చేసిందని, త్వరలో ఈ పరికరాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఉస్మానియా దవాఖానలో మరింత మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. కొత్తగా 135 స్టాఫ్ నర్సులను కేటాయించగా, పది ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. వైద్యశాల ఆవరణలోని జీహెచ్ఎంసీ నైట్ షెల్టర్లో ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ను బుధవారం సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ప్రారంభించారు. ఈ కాంప్లెక్స్లో జనరల్ సర్జరీకి చెందినవి ఏడు, ఆర్థోపెడిక్ విభాగాలకు చెందినవి మూడు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఒక్కో థియేటర్లో ఒక్కో టేబుల్ చొప్పున 10 థియేటర్లలో పది టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్పై ప్రతి రోజు మూడు శస్త్రచికిత్సలు చేసే వీలుంటుందని సూపరింటెండెంట్ తెలిపారు.
అత్యాధునిక వైద్యసదుపాయాలతో కొత్తగా నిర్మించిన ఆపరేషన్ థియేటర్లలో ప్రతి టేబుల్పై రోజుకు మూడు చొప్పున శస్త్రచికిత్సలు నిర్వహించవచ్చు. 10 ఆపరేషన్ థియేటర్లలో ప్రతి రోజు కనీసం 30 మేజర్ శస్త్రచికిత్సలు చేయవచ్చని సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ వివరించారు. ప్రధానమైన జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో, ఆర్థో విభాగాలకు సంబంధించిన కేసులు ఉస్మానియాకు అధిక సంఖ్యలో వస్తుంటాయని, రోగులకు చికిత్సలో నిరీక్షణ లేకుండా ఉండేందుకు ఈ ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అత్యాధునిక వైద్యపరికరాల కోసం ప్రభుత్వం రూ. 17.70 కోట్లను మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో త్వరలోనే అన్ని రకాల మెడికల్ పరికరాలు, కార్డియాలజీ విభాగానికి సంబంధించి క్యాథ్లాబ్ను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా దవాఖాన బలోపేతానికి సహకరించడం సంతోషకరమన్నారు. కాగా, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో నర్సింగ్ సూపరింటెండెంట్ ఆర్. సుజాత, సీఎస్ఆర్ఎంవో-1 డాక్టర్ శేషాద్రి, అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ పాండునాయక్, ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ తిమ్మారెడ్డి, శస్త్రచికిత్సల విభాగాధిపతి డాక్టర్ వెంకటేశ్వర్లు, సీఏఎస్ఆర్ఎంవోలు డాక్టర్ సాయిశోభ, వైద్యులు బండారి శ్రీనివాసులు, అనురాధ, సుష్మ, మహ్మద్ రఫీక్, రాజ్కుమార్, మాధవి, ప్రసాద్, పల్లం ప్రవీణ్కుమార్, సిద్దిపేట రమేశ్, మెడికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ రమేశ్, టీఎస్ఎంఐడీసీ ప్రతినిధులు సురేందర్,సుబ్బారావు,శ్యామ్లాల్, ఖాజా మోయినోధ్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఉస్మానియా దవాఖానలో స్టాఫ్ నర్సుల కొరత తీరినట్లే. టీఎస్పీఎస్సీ ద్వారా స్టాఫ్ నర్సుల ఎంపిక ప్రక్రియ పూర్తవ్వగా, 135 మందిని ఉస్మానియా దవాఖానకు కేటాయించారు. బుధవారం 95 మంది సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ను కలిసి రిపోర్టు చేశారు. వీరి వివరాలను సేకరించేందుకు సూపరింటెండెంట్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సూపరింటెండెంట్తో పాటు సీఎస్ఆర్ఎంవో డాక్టర్ శేషాద్రి, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆర్. సుజాత ఉన్నారు. కాగా, 95 మందిలో పది మంది పురుషులు, 85 మంది మహిళా నర్సులు ఉన్నట్లు నర్సింగ్ సూపరింటెండెంట్ తెలిపారు. కొత్తగా వచ్చిన వారందరికీ వారం రోజుల పాటు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తామని, ఇంకా 40 మంది రిపోర్టు చేయాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా 82 మంది కాంట్రాక్టు స్టాఫ్నర్సులను తొలగించడంతో పాటు డిప్యూటేషన్పై వచ్చిన 18 మంది స్టాఫ్ నర్సులను రిలీవ్ చేశారు. కొత్త నియామకాలతో దవాఖానలో స్టాఫ్ నర్సుల కొరత తీరిందని సూపరింటెండెంట్ నాగేందర్ తెలిపారు.