రామ్గఢ్: జార్ఖండ్ రాష్ట్రం రామ్గఢ్ జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణహత్యకు ( Murder ) గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంట్లో దూరి హత్యచేశారు. ఈ ఘటనలో కాంగ్రెస్ నాయకుడి భార్య కూడా తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నది. వివరాల్లోకి వెళ్తే.. కాంగ్రెస్ నాయకుడు కమ్లేష్ నారాయణ్ శర్మ (60) రామ్గఢ్ జిల్లాలోని సెంట్రల్ సౌందా కాలనీలో భార్య చంచలా శర్మతో కలిసి నివాసం ఉంటున్నాడు.
గతంలో ఆయన రామ్గఢ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. అయితే, శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నారాయణ్ శర్మ ఇంట్లోకి ప్రవేశించి ఆయనపై ఇనుప రాడ్లతో దాడిచేశారు. ఈ దాడిలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. అడ్డుకోబోయిన ఆయన భార్యపై కూడా దుండగులు దాడికి పాల్పడటంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు.