చెన్నై : భర్త ఇంట్లో మరుగుదొడ్డి లేదని మనస్ధాపం చెందిన మహిళ (27) బలవన్మరణానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని కడలూర్ జిల్లాలో వెలుగుచూసింది. అరిసిపెరియకుప్పం గ్రామానికి చెందిన రమ్య ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఆమెకు ఏప్రిల్ 6న కార్తికేయన్తో వివాహమైంది.
భర్త ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో రమ్య పెండ్లి తర్వాత కూడా తల్లి వద్దే ఉంటోంది. కడలూర్ నగరంలో టాయ్లెట్ వసతి ఉన్న ఇల్లు చూడాలని కార్తికేయన్ను కోరింది. ఈ విషయమై ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. ఈ విషయంలో తీవ్ర మనస్దాపానికి లోనైన రమ్య సోమవారం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది.
రమ్య తల్లి హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించింది. ఆపై పాండిచ్చేరిలోని జిప్మర్కు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది. రమ్య తల్లి మంజుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.