హైదరాబాద్: నగర శివార్లలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. బుధవారం ఉదయం ఇంటెలిజెన్స్ అధికారులు ఎయిర్పోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న మహమ్మద్ అనే ప్రయాణికుడి వద్ద రూ.1.03 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు గుర్తించారు. దీంతో కరెన్సీని స్వాదీనం చేసుకుని, నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కస్టమ్స్ అధికారులు అతడిని విచారిస్తున్నారు.
నకిలీ పాస్పోర్టుతో దుబాయ్ వెళ్లేందుకు యత్నం..
నకిలీ పాస్పోర్టు, వీసాలతో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్కు చెందిన రెహ్మాన్ మాలిక్, షాదుల్ మాలిక్ అనే ఇద్దరు శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా (ఏఐ 951) విమానంలో టికెట్ బుక్చేసుకున్నారు. దీంతో వారు ఇవాళ ఉదయం విమానం ఎక్కేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. దీంతో వారి వద్ద ఉన్నవి నకిలీ వీసా, పాస్పోర్టులు అని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.