లక్నో: లిక్కర్ మాఫియాకు చెందిన ఐదుగురు గ్యాంగ్స్టర్లు పోలీసులకు లొంగిపోయారు. సీఎం విధానాలకు ప్రభావితమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉత్తర ప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఖుతార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెనియా గ్రామానికి చెందిన కశ్మీర్ సింగ్, రోషన్ సింగ్, దేశరాజ్ సింగ్, చమన్ సింగ్, గుర్మీత్ అనే ఐదుగురు ఆ ప్రాంతంలో అక్రమంగా మద్యం తయారు చేసి అమ్ముతున్నారు. లిక్కర్ మాఫియా నడుపుతున్న వీరిలో నలుగురు రౌడీ షీటర్లు. వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
కాగా, యూపీ ఎక్సైజ్ పోలీసులు అక్రమ మద్యం తయారీ, అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమ మద్యం తయారీ బట్టీలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లిక్కర్ మాఫియాకు చెందిన ఐదుగురు గ్యాంగ్స్టర్లు కశ్మీర్ సింగ్, రోషన్ సింగ్, దేశరాజ్ సింగ్, చమన్ సింగ్, గుర్మీత్, షాజహాన్పూర్ పోలీసులకు లొంగిపోయారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ విధానాలు నచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అక్రమ లిక్కర్ బిజినెస్ను ఆపేపి సరెండర్ అయినట్లు చెప్పారు. ఈ మేరకు ఫ్లకార్డులను వారు ప్రదర్శించారు.
మరోవైపు లొంగిపోయిన ఐదుగురు లిక్కర్ మాఫియా గ్యాంగ్స్టర్లను పోలీసులు విడిచిపోట్టారు. ఇకపై అక్రమ మద్యం వ్యాపారాన్ని కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు వారిని హెచ్చరించారు. కాగా గత ఏడాది సెప్టెంబర్ 30 నుంచి చేపట్టిన అక్రమ మద్యం కట్టడి డ్రైవ్లో భాగంగా 5.8 లక్షల లీటర్ల అక్రమ మద్యం, 7,744 అక్రమ ఆయుధాలు, 11,690 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. సుమారు 1,451 అక్రమ మద్యం తయారీ యూనిట్లను ధ్వంసం చేశామని, 20,262 కేసులకు సంబంధించి 21,019 మందిని అరెస్టు చేశామని చెప్పారు.