న్యూఢిల్లీ : సైబర్ నేరాలపై ప్రభుత్వాలు, పోలీసులు ప్రజల్లో అవగాహన పెంచుతున్నా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతూనే ఉన్నారు. రోజుకో స్కామ్తో నేరగాళ్లు అమాయకుల నుంచి అందినకాడికి కొట్టేస్తున్నారు. ఆన్లైన్ వేదికగా పార్ట్టైం జాబ్లు, యూట్యూబ్ వీడియోల ద్వారా ఆదాయం ఆర్జించవచ్చే పేరిట పలు స్కామ్లతో జనాన్ని ముంచిన సైబర్ నేరగాళ్లు లేటెస్ట్గా కొరియర్ స్కామ్కు తెరలేపారు. తాజాగా బెంగళూర్కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పీహెచ్డీ విద్యార్ధిని నుంచి ఫెడెక్స్ ఉద్యోగిగా చెప్పుకున్న ఓ వ్యక్తి రూ. 1,34,650 కాజేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సదరు వ్యక్తి ఆమెకు కాల్ చేసి మీ అడ్రస్కు అక్రమ వస్తువులతో కూడిన ప్యాకేజ్ పంపారని, ఆపై ముంబై నార్కోటిక్స్ డివిజన్ అధికారికి కనెక్ట్ చేస్తున్నానని చెప్పాడు. ఆపై వారు ఆమెను గుర్తించేందుకు స్కైప్ కాల్లో జాయిన్ కావాలని కోరడంతో పాటు బ్యాంక్ స్టేట్మెంట్ను అడిగారు. ముంబై నార్కోటిక్స్ డివిజన్ అధికారిగా చెప్పుకున్న బృందం మీరు అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని బాధితురాలిని బెదిరించింది.
నిందితులు బెదిరిస్తూ డబ్బు కోరడంతో భయపడిన తాను రూ. 1.3 లక్షలను నేరగాళ్ల ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశానని బాధితురాలు పేర్కొంది. ఇక ఇదే తరహాలో ముంబైకి చెందిన ఓ టెకీని నార్కోటిక్స్ విభాగానికి చెందిన అధికారులమని కొందరు బెదిరించి రూ. 1.97 లక్షలకు మోసగించారు. కొద్దివారాల కిందట ఢిల్లీకి చెందిన ఓ వైద్యుడిని కూడా సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ. 4.47 కోట్లు మోసగించారు.
కొరియర్ స్కామ్తో ఇలా దోచేస్తారు..!
సైబర్ నేరగాళ్లు బాధితులను సంప్రదించి డ్రగ్స్, ఇతర అక్రమ వస్తువులతో కూడిన పార్సిల్స్ను మీ పేరుతో విదేశాలకు పంపుతున్నారని బోల్తా కొట్టిస్తారు. బాధితులు వారి వలలో పడితే స్కైప్ కాల్లో జాయిన్ కావాలని కోరతారు. ఆపై వారు నార్కోటిక్స్ అధికారుల్లా నటిస్తూ బాధితులను మరింత భయపెడతారు. బాధితుల బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్ ఇతర కీలక సమాచారంతో కూడిన పత్రాలను ఇవ్వాలని పట్టుబడతారు. ఇక వెరిఫికేషన్ పేరుతో మళ్లీ రిఫండ్ చేస్తామని మభ్యపెడుతూ భారీ మొత్తంలో నగదు ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. బాధితుడి నుంచి డబ్బు కాజేసిన మరుక్షణమే నిందితులు తమ కాంటాక్ట్స్ అన్నింటినీ బ్లాక్ చేస్తారు.
Read More :
Corna Virus: కరోనా వైరస్ను జీవాయుధంగా చైనా వాడింది: వుహాన్ పరిశోధకుడు