బీజింగ్: కరోనా వైరస్(Corna Virus) గురించి వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్కు చెందిన ఓ పరిశోధకుడు సంచలన విషయాలను చెప్పాడు. కరోనా వైరస్ను ఓ జీవాయుధంగా చైనా ప్రయోగించినట్లు అతను వెల్లడించాడు. నాలుగు రకాల వైరస్ స్ట్రెయిన్లకు తమకు ఇచ్చి ఏది వేగంగా వ్యాపిస్తుందో కనుగొనమన్నట్లు చెప్పాడు. వుహాన్ ల్యాబ్లో రీసర్చ్గా చేసిన చావో షావో ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంటర్నేషనల్ ప్రెస్ అసోసియేషన్కు చెందిన జెన్నిఫర్ జెంగ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఈ షాకింగ్ అంశాలను తెలిపాడు.
చావో షావోతో పాటు మరో పరిశోధకుడు షాన్ చావో కూడా వుహాన్ వైరాలజీ ల్యాబ్లో పనిచేశారు. తమ బాస్లు తమకు నాలుగు రకాల వైరస్లు ఇచ్చారని, దాంట్లో ఏ రకమైన వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందో పరీక్షించాలని ఆదేశించినట్లు చెప్పాడు. వీలైనంత మందిని సోకే సామర్థ్యం ఏ వైరస్కు ఉందో పరీక్షించినట్లు ఆ పరిశోదకుడు తెలిపాడు. మనుషులతో పాటు ఇతర జీవాలకు ఏ వైరస్ తొందరగా సోకుతుందో టెస్ట్ చేసినట్లు చెప్పాడు. కరోనా వైరస్ను ఓ జీవాయుధంగా చైనా డెవలప్ చేసిందని చావో షావో పేర్కొన్నాడు.
2019లో వుహాన్లో జరిగిన మిలిటరీ వరల్డ్ గేమ్స్ సమయంలో తనతో పనిచేసే చాలా మంది మిస్సయ్యారని, వేరే దేశాలకు చెందిన అథ్లెట్లు ఉంటున్న హోటళ్లకు తమను పంపారని, అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు తమను పంపినట్లు సీనియర్లు చెప్పారని, కానీ వైరాలజిస్టులు అవసరం లేని ప్రాంతాలకు తమను పంపి, వైరస్ను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించినట్లు చావో షావో ఆరోపించాడు. జిన్జియాంగ్లో ఉయిగర్లు ఉంటున్న క్యాంపుల వద్దకు కూడా తమను పంపినట్లు అతను చెప్పాడు. కరోనా వైరస్ పుట్టుక గురించి ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ ఆ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది మరణించారు.