చెన్నై : తమిళనాడులోని మయిలదుతురైలో మహిళను ఆమె నివాసం నుంచి 15 మంది వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఉదంతం కలకలం రేపింది. మంగళవారం రాత్రి జరిగిన కిడ్నాప్ ఘటన సమీప సీసీటీవీ కెమెరాలో రికార్డవడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆపై మహిళను మయిలదుతురై పోలీసులు కాపాడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల ప్రకారం 15 మంది వ్యక్తులు ఇంటి ఫ్రంట్ గేట్ను పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అదే రోజు రాత్రి పోలీసులు ఆమెను కాపాడి నిందితులను అరెస్ట్ చేశారు. ఇక ఘటన వివరాల్లోకి వెళితే బాధితురాలితో పరిచయం పెంచుకున్న నిందితుల్లో ఒకరైన విఘ్నేశ్వరన్ (34) ఆమెను వేధిస్తుండేవాడు.
విఘ్నేశ్వరన్ తీరుతో విసిగిన మహిళ స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితుడిని అదుపులోకి తీసుకుని బెదిరించి వదిలేశారు. జులై 12న ఆమెను కిడ్నాప్ చేసేందుకు విఘ్నేశ్వరన్ ప్రయత్నించగా తప్పించుకున్న మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది. ఇక విఘ్నేశ్వరన్ మరో 14 మంది అనుచరులతో కలిసి మహిళ ఇంటి తలుపు పగులగొట్టి కుటుంబ సభ్యులను కత్తులతో బెదిరించి ఆమెను అపహరించాడు.