ముంబై : మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. కోటి రూపాయల బీమా సొమ్మును దక్కించుకోవచ్చనే దురాశతో అనుచరుల సాయంతో భర్త (45)ను హత్య చేసిన భార్య ఉదంతం బయటపడింది. మృతుడిని లాతూర్ సమీపంలోని రెనాపూర్కు చెందిన మంచక్ గోవింద్ పవార్గా గుర్తించారు.
జూన్ 11న పవార్ మృతదేహం అహ్మద్నగర్ హైవేలోని బీద్ పింపర్గావ్ రోడ్పై లభ్యమైంది. పోలీసుల దర్యాప్తులో పవార్ను భార్య గంగాబాయ్ (37) హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్టు వెల్లడైంది. దర్యాప్తులో భాగంగా భార్య స్టేట్మెంట్పై పోలీసులకు అనుమానం రాగా ఆమెను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించడంతో షాకింగ్ వివరాలు తెలిశాయి.
భర్త బీమా సొమ్ము కోసమే మరో ఇద్దరితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు నిందితురాలు అంగీకరించింది. భర్తను చంపేందుకు ఇద్దరు హంతకులతో ఆమె రూ 2 లక్షలకు బేరం కుదుర్చుకుంది. నిందితులు పవార్ తలపై పదునైన ఆయుధంతో బలంగా కొట్టడంతో మరణించాడు. భార్య సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.