ముంబై : మహారాష్ట్రలోని పుణేలో దారుణం వెలుగుచూసింది. మహిళపై ఎనిమిది మంది పలు ప్రాంతాల్లో భిన్న సమయాల్లో లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వితంతు మహిళపై దారుణానికి పాల్పడిన ఐదుగురు నిందితులను పుణే రూరల్ పోలీసులు అరెస్ట్ చేయగా మరో ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి షిరూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
వితంతువుపై పలువురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారనే సమాచారంతో వెంటనే స్పందించామని ఇన్స్పెక్టర్ సురేష్కుమార్ రౌత్ వెల్లడించారు. బాధితురాలితో పాటు నిర్భయ బృందాన్ని ఘటనా స్ధలానికి పంపామని మహిళ నుంచి పలు వివరాలు సేకరించి నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 2021 ఏప్రిల్ నుంచి 2021 మే మధ్య వితంతు మహిళపై పలువురు నిందితులు పలు ప్రాంతాల్లో లైంగిక దాడులకు పాల్పడ్డారని రౌత్ తెలిపారు.
నిందితుల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధితురాలు భావించినా ఆమెకు సరైన పరిజ్ఞానం లేకపోవడంతో పాటు ఎలాంటి సాయం లభించలేదని చెప్పారు. నిందితులను మౌళి పవార్, కలు వలుంజ్, విఠల్ కాలే, రజక్ పఠాన్, పప్పు గైక్వాడ్, ఆకాష్ గైక్వాడ్, నవ్నాధ్ వలుంజ్, సందీప్ వలుంజ్గా గుర్తించారు. మహిళను చంపుతామని బెదిరించి ఆమెపై నిందితులు లైంగిక దాడులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాధితురాలికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారని వారు ఆమె కుటుంబ సభ్యుల వద్ద నివసిస్తున్నారని చెప్పారు.