లక్నో : యూపీలో యువతులు, మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల పర్వం కొనసాగతూనే ఉంది. లలిత్పూర్ జిల్లా పాలి పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ సహా ఆరుగురు నిందితులు 13 ఏండ్ల బాలికపై లైంగిక దాడులకు పాల్పడ్డారు. ఈ కేసులో స్టేషన్ ఇన్చార్జ్ను అధికారులు సస్పెండ్ చేశారు. లలిత్పూర్ ఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు.
పాలి ప్రాంతానికి చెందిన నలుగురు బాలురు ఏప్రిల్ 22న బాలికను మభ్యపెట్టి భోపాల్కు తీసుకువెళ్లి అక్కడ మూడు రోజుల పాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుగు రోజుల తర్వాత బాలికను పాలి పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ తిలక్ధారి సరోజ్కు అప్పగించి పరారయ్యారు. దీంతో బాలికను ఆయన చైల్డ్ లైన్ సెంటర్కు పంపాడు. రెండు రోజుల తర్వాత బాలిక స్టేట్మెంట్ రికార్డు చేయాలనే పేరుతో ఆమెను స్టేషన్కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడి తిరిగి చైల్డ్ లైన సెంటర్కు పంపాడు.
చైల్డ్ లైన్ నిర్వాహకులు చేపట్టిన కౌన్సెలింగ్లో బాలిక జరిగిన విషయం తెలపడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పాలి స్టేసన్ ఇన్చార్జ్ సహా ఆరుగురు నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్టేషన్ ఇన్చార్జ్ను సస్పెండ్ చేసిన అధికారులు ఈ కేసులో ఓ నిందితుడని అరెస్ట్ చేశారు. ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దోషులపై కఠిన చర్యలు చేపడతామని ఎస్పీ వెల్లడించారు.