అహ్మదాబాద్ : యువతి తన ఇంటి వద్ద వాకింగ్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు లైంగిక వేధింపులకు గురిచేసి దుర్భాషలాడిన ఘటన అహ్మదాబాద్లోని మేమ్నగర్ ప్రాంతంలో జరిగింది. నరన్పురా పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో సోమవారం ఈ వ్యవహారం వెలుగుచూసింది.
మార్చి 8న రాత్రి తమ వీధిలో తాను ఒంటరిగా వాకింగ్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు తనను వెంబడించి వేధింపులకు గురిచేశారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తాను ప్రతిఘటించడంతో ఓ వ్యక్తి అభ్యంతరకరంగా వ్యవహరించగా మరో ఇద్దరు కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలిపింది.
ఈలోగా తాను తన సోదరుడిని పిలవగా ముగ్గురు నిందితులు అతడిని నెట్టివేసి గాయపరిచారని వెల్లడించింది. అడ్డుకున్న తనపై దాడి చేసి దుస్తులు చించేశారని పేర్కొంది. దీంతో పోలీస్ కంట్రోల్ రూంకు కాల్ చేసి నిందితులపై ఫిర్యాదు చేశానని వెల్లడించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.