కాన్పూర్ : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య ఉదంతం యూపీలోని కాన్పూర్లో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి మహిళ ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశామని దక్షిణ కాన్పూర్ అదనపు డీసీపీ మనీష్ సొంకర్ తెలిపారు. వివాహేతర సంబంధంపై భార్యను వారించడంతో ప్రియుడితో కలిసి భర్త కల్లు (32)ను నిందితురాలు హత్య చేసింది. గత వారం గోవింధ్ నగర్లోని నిరాల నగర్ రైల్వే గ్రౌండ్ సమీపంలోని అటవీ ప్రాంతంలో బాధితుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహం పై భాగాన్ని జంతువులు తినివేయగా మృతుడి షర్ట్ జేబులో మొబైల్ ఫోన్ను పోలీసులు గుర్తించారు.
కల్లు మృతిపై పోలీసులు అతడి భార్యను ప్రశ్నించగా పనికి వెళ్లిన తన భర్త రాత్రి ఆలస్యంగా వస్తానని చెప్పాడని, 9 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో పలుమార్లు ఫోన్ చేశానని, తిరిగి ఉదయం ఫోన్ చేయగా లిఫ్ట్ చేసిన పోలీసులు ఘటన గురించి సమాచారం అందించారని చెప్పింది. తన భర్త మద్యానికి బానిసయ్యాడని నలుగురు వ్యక్తులు కలిసి ఆయనను హత్య చేశారని నమ్మబలికింది. పోలీసులు మృతుడి భార్యను తమదైన శైలిలో ప్రశ్నించగా హత్యోదంతం వెలుగుచూసింది.
ప్రియుడితో తాను గంటల తరబడి మాట్లాడుతుండటంపై భర్త అభ్యంతరం చెప్పాడని తమ సంబంధానికి అడ్డుగా ఉన్నందుకే అతడిని అంతమొందించామని తెలిపింది. ప్రియుడితో కలిసి భర్త చేతి నరాలు బ్లేడ్తో కోసి హత్య చేశామని వెల్లడించింది. మృతదేహాన్ని నిర్జన ప్రదేశంలో పడేసిన తర్వాత మృతుడిని గుర్తుపట్టకుండా ముఖాన్ని మహిళ ప్రియుడు ఛిద్రం చేశాడని పోలీసులు తెలిపారు.