జైపూర్ : మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. రాజస్ధాన్లోని నాగౌర్లోని మరోధ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో 15 ఏండ్ల బాలికపై ఇద్దరు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు బుధవారం స్కూల్కు వెళుతుండగా బైక్పై వెళుతున్న ఇద్దరు నిందితులు లిఫ్ట్ ఇస్తామని బైక్పై ఎక్కించుకున్నారు. మార్గమధ్యలో నిందితులు బాలికకు మత్తుమందు ఇచ్చి సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు. వారు నేరాన్ని వీడియో తీసి విషయం ఎవరికైనా చెబితే కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు. బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్లో నిందితులు శంకర్ లాల్ (22), ఓం ప్రకాష్ (21) పేర్లను చేర్చారు.
పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని పోలీసులు చెప్పారు. ఇక మరో ఘటనలో మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాద్ ప్రాంతంలో ఇటీవల 13 ఏండ్ల బాలికపై కార్మికుడు (21) లైంగిక దాడికి పాల్పడ్డాడు. కూలీలైన తల్లితండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న బాలికపై నిందితుడు దారుణానికి తెగబడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని పోలీసులు చేశారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.