చెన్నై : తమిళనాడులో దారుణ ఉదంతం వెలుగుచూసింది. అప్పులు తీర్చుకునేందుకు ఓ వ్యక్తి తన రెండు నెలల చిన్నారిని రూ 80,000కు విక్రయించిన ఘటన తిరుచ్చిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడితో పాటు ఏజెంట్ సహా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని పందమంగళంకు చెందిన అబ్ధుల్ సలాంగా గుర్తించారు.
నిందితుడికి నలుగురు సంతానం కాగా గ్యాంబ్లింగ్, తాగుడు వంటి వ్యసనాలతో డబ్బు పోగొట్టుకోవడంతో పాటు ఉద్యోగాన్నీ కోల్పోయాడు. ఈ క్రమంలో రెండు నెలల కిందట సలాం భార్య కైరున్నిసా బాబుకు జన్మనిచ్చింది. తన బిడ్డను ముగ్గురు వ్యక్తులు అమ్మేశారని కైరున్నిసా ఇటీవల వరియూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ వివరాలు వెల్లడయ్యాయి.
నిందితుడు అదే ప్రాంతానికి చెందిన అరాకియరాజ్ అనే వ్యక్తి వద్ద రూ 50,000 అప్పు తీసుకున్నాడు. సలాం ఈ సొమ్ము తిరిగి ఇవ్వలేకపోవడంతో తన కొడుకును అమ్మాలని ప్రతిగా మరికొంత డబ్బు ఇస్తానని అరాకియరాజ్ నిందితుడిని కోరాడు. ఈ ప్రతిపాదనను సలాం భార్య కైరున్నిసా తోసిపుచ్చింది. భార్యకు ఇష్టం లేకపోయినా సలాం బలవంతంగా చిన్నారిని అరాకియరాజ్ బంధువుకు అప్పగించాడు. జనవరి 19న ఈ ఘటన జరగ్గా ఆపై కైరున్నిసా భర్తతో పాటు మరో ఇద్దరు నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.