అహ్మదాబాద్ : తనను ప్రియురాలు దూరం పెడుతోందనే ఆగ్రహంతో మహిళ (35) గొంతు కోసి ఉసురుతీసిన వ్యక్తి (40) ఉదంతం అహ్మదాబాద్లో వెలుగుచూసింది. నగరంలోని మాధవపుర ప్రాంతంలో మహిళ గొంతుకోసిన నిందితుడు ఆమెను నడిరోడ్డుపై పలుమార్లు కత్తితో పొడిచి పరారయ్యాడు. పోలీస్స్టేషన్కు కేవలం 100 మీటర్ల దూరంలో ఈ ఘటన జరగడం గమనార్హం. బాధితురాలు ఆశ తనతో సంబంధాన్ని తెగదెంపులు చేసుకోవడంతో నిందితుడు నరేష్ రాధోడ్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
బాధితురాలి భర్త భరత్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆశ, భరత్ దుధేశ్వర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఏడాది కిందట ఆశ నిందితుడితో వివాహేతర సంబంధం కలిగిఉంది. ఇటీవల అతడిని దూరం పెడుతుండటంతో ఆగ్రహానికి లోనైన నిందితుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో తనతో సన్నిహితంగా మెలగాలని ఆమెను వెంబడిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు.
మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఆశ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వెళుతూ కూరగాయల బండి వద్ద ఆగగా వెనుకనుంచి వచ్చిన నిందితుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. గొంతు కోసి ఆపై బాధితురాలిపై కత్తిపోట్లతో విరుచుకుపడ్డాడు. ఆమె మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత పరారయ్యాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.