న్యూఢిల్లీ : వాగ్వాదం ముదరడంతో ఆగ్రహానికి లోనైన వ్యక్తి భార్యను హత్య చేసిన ఘటన గురువారం అర్ధరాత్రి ఢిల్లీలోని అలీపూర్లో వెలుగుచూసింది. మృతురాలిని జార్ఖండ్కు చెందిన గుడియా దేవిగా గుర్తించారు. అలీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ హత్యకు గురైందని సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు.
మహిళను బాబూ జగ్జీవన్ రామ్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించిందని వైద్యులు నిర్ధారించారు. 15 రోజుల కిందట నగరానికి వచ్చిన తమ కూతురును ఇంటికి తీసుకువెళ్లేందుకు భర్తతో కలిసి బాధితురాలు ఢిల్లీకి వచ్చింది.
ఓ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త మహిళను నెట్టివేసి తీవ్రంగా హింసించాడు. మహిళ ముఖంపై తీవ్ర గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.