అహ్మదాబాద్ : బంధువుల ఇంటికి వెళుతున్న 15 ఏండ్ల బాలికపై ఎనిమిది మంది నిందితులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన అహ్మదాబాద్ జిల్లా దోల్కా పట్టణ సమీపంలో వెలుగుచూసింది. 19 నుంచి 30 ఏండ్ల లోపున్న నిందితులు పట్టణ శివార్లలోని పొలంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. నేరానికి పాల్పడిన అనంతరం బాలికను వారు ఆమె బంధువుల ఇంటి వద్ద విడిచివెళ్లారు.
ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి 8.30 గంటల నుంచి 11 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. బంధువుల ఇంటికి వెళుతున్నానని కుటుంబ సభ్యులకు తెలిపిన బాలిక ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో వారు బంధువులను వాకబు చేశారు. బాలిక తమ ఇంటికి రాలేదని చెప్పడంతో ఆమె కోసం గాలించారు. ఇంటికి చేరిన బాలికను ఏమైందని ప్రశ్నించగా నిందితుల ఆగడాలను వెల్లడించింది.
బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో తనకు పరిచయమున్న ముగ్గురు వ్యక్తులు తమతో రావాలని ఒత్తిడి చేసి సమీప పొలంలోకి తీసుకువెళ్లారని అక్కడ సిద్ధంగా ఉన్న మరో ఐదుగురితో కలిసి ఎనమిది మంది లైంగిక దాడికి పాల్పడ్డారని బాలిక తెలిపింది. నిందితులను శివాజీ ధకోర్, ప్రకాష్ ధకోర్, అర్జున్ దుధాని, అజయ్ థకోర్, కేతన్ ధకోర్, సునీల్, మహేష్ పటేల్గా గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశా మని పోలీసులు తెలిపారు.