లక్నో : యూపీలో మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక దాడి ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా దళిత బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన బులంద్షహర్ జిల్లా పహసు పోలీస్స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.
బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. వేరే వర్గానికి చెందిన యువకుడు తన కూతురిని కిడ్నాప్ చేశాడని బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. మేజిస్ట్రేట్ ఎదుట బాలిక ఇచ్చిన స్టేట్మెంట్లో ఘటన వివరాలు వెల్లడించింది. మార్చి 26న యువకుడు తనను అపహరించాడని ఆపై ఇద్దరు అనుచరులతో కలిసి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపింది.
వైద్య పరీక్షల్లో బాలికపై లైంగిక వేధింపులు జరిగాయని వెల్లడైంది. బాలిక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఓ నిందితుడిని అరెస్ట్ చేశామని మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని ఇన్చార్జ్ ఎస్పీ సురేంద్ర తివారీ తెలిపారు.