న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగుచూసింది. ఘాజీపూర్ ప్రాంతంలో బుధవారం రాత్రి 36 ఏండ్ల మహిళపై లైంగిక దాడి ఘటన కలకలం రేపింది. బాధిత మహిళ ఘటన వివరాలను వెల్లడించింది. కార్యాలయంలో విధులు ముగించుకుని ఆటోలో ఇంటికి తిరిగివెళుతుండగా పెట్రోల్ ట్యాంక్ ఖాళీగా ఉందని ఆటోడ్రైవర్ మార్గమధ్యలో ఆటోను ఆపాడని తెలిపింది.
ఆటోడ్రైవర్ మరో వ్యక్తికి ఫోన్ చేసి అక్కడికి పిలిపించాడని ఆపై ఇద్దరూ కలిసి తనను నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
నిందితులపై లైంగిక దాడి, కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి ఆరోపణలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.