భోపాల్ : మధ్యప్రదేశ్లోని భింద్లో దారుణం జరిగింది. పెండ్లయి నలుగురు బిడ్డలకు తండ్రయిన వార్డు బాయ్ నర్సుతో వివాహానికి మొగ్గుచూపాడు. తన ప్రపోజల్ను నిరాకరించిందనే కోపంతో ఆస్పత్రి ఐసీయూలోనే వార్డు బాయ్ ఆమెపై కాల్పులు జరిపి కడతేర్చాడు. ఈ ఘటనతో నర్సింగ్ సిబ్బంది పనులను నిలిపివేసి ఆస్పత్రి ప్రాంగణంలో తమకు మెరగైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
గురువారం రాత్రి వార్డు బాయ్ రితేష్ సక్య నర్సు నేహ చందేల్ (26)ను ఐసీయూలో తలపై గురిపెట్టి కాల్పులు జరిపాడని బింధ్ ఎస్పీ శైలేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. కాల్పుల అనంతరం నేహ కుప్పకూలి ఘటనా స్ధలంలోనే ప్రాణాలు విడిచారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. మరోవైపు ఘటన అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నేహకు వేరొక వ్యక్తితో వివాహం ఖరారు కాగా తనను పెండ్లి చేసుకోవాలని వివాహితుడైన నిందితుడు ఒత్తిడి పెంచాడు.
గత కొద్దినెలలుగా ఇదే విషయమై నిందితుడు ఆమె వెంటపడగా బాధితురాలు తిరస్కరించింది. ఈ ఘటన నేపధ్యంలో తమకు భద్రత కల్పించాలని కోరుతూ వంద మందికి పైగా నర్సులు ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నాకు దిగారు. నిరసనలతో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అజిత్ మిశ్రా తెలిపారు.