బంజారాహిల్స్ : రోజుకు గంట పనిచేస్తే రూ.5వేల దాకా సంపాదించుకోవచ్చంటూ చెప్పిన మాయమాటలకు ఓ వ్యక్తి మోసపోయాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. టోలీచౌకిలో నివాసం ఉంటున్న అబ్దుల్ సత్తార్ (24) ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. పార్ట్టైమ్ జాబ్ కోసం వెతికే క్రమంలో ఈ-బే 988 అనే వెబ్సైట్ను క్లిక్ చేశాడు. దాంతో అతడికి వాట్సప్లో వ్యక్తి మెసేజ్ చేశాడు. రోజుకు గంటసేపు పనిచేస్తే రూ.500 నుంచి రూ.5వేల దాకా సంపాదించే అవకాశం ఉంటుందని నమ్మబలికాడు.
అతడి సూచనల మేరకు ఫోన్ నెంబర్స్, బ్యాంక్ ఖాతా వివరాలు అందజేశాడు. తమ సైట్లో ప్రొడక్ట్ కొని అమ్మితే కమిషన్ వస్తుందని చెప్పడంతో సత్తార్ అతడు సూచించిన ప్రొడక్ట్ ఆర్డర్ ఇవ్వగానే రూ.10 కమిషన్ వచ్చింది. దాంతో మరికొన్ని ప్రొడక్ట్ కొంటే మరింత కమిషన్ వస్తుందని చెప్పడంతో అర్డర్లు ఇచ్చాడు. దీనిలో భాగంగా సుమారు 69వేల నగదు ఈ-బే 988 అకౌంట్లో వేయగానే అకౌంట్ ఫ్రీజ్ అయింది. దాంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.