ఇబ్రహీంపట్నం : బీహార్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల నుంచి అక్రమంగా 12మంది బాల కార్మికులను తీసుకొచ్చి వెట్టి చాకిరి చేయిస్తున్న కంపెనీపై రాచకొండ పోలీసులు కోరడ విధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని మంగల్పల్లి సమీపంలో గల రిషాబ్ ఇండస్ట్రీయల్లో కొంతకాలంగా బాలకార్మికుల చేత వెట్టిచాకిరి చేయించుకుంటున్న విషయాన్ని రాచకొండ మానవ అక్రమ రవాణ విభాగం, స్పందన చైల్డ్లేబర్, బచ్పన్ బచావో బృందాలు తెలుసుకున్నారు. మంగళవారం తెల్లవారు జామున ఇబ్రహీంపట్నం పోలీసుల సహాకారం తీసుకుని కంపెనీపై దాడి చేసి బాలకార్మికులకు విముక్తి కల్పించారు. 12మంది బాలకార్మికులను సునీల్ కుమార్ అనే లేబర్ కాంట్రాక్టర్ బీహార్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చి కంపెనీ యాజమాన్యానికి అప్పగించారు.
అప్పటి నుంచి కంపెనీ యాజమాని భూపేష్జైన్ వారిని కంపెనీలో నిర్భందించి ఒక్క షెడ్డులో ఉంచి వెట్టిచాకిరి చేయిస్తున్నాడు. కంపెనీలో అట్టల తయారీ, పేపర్ప్లేట్లు తయారీకి వీరి చేత పనులు చేయిస్తున్నాడు. వారు బయటకు రాకుండా సెక్యూర్టీని కాపలా ఉంచాడు. వీరిని ఉదయం 8నుంచి రాత్రి 10గంటలకు వరకు పని చేయిస్తున్నాడు. వీరికి కూలి కూడా అతి తక్కువగా ఇస్తున్నాడు. ఎవరూ ప్రశ్నించడానికి సాహసించకపోవడంతో విషయం బయటకు రాలేదు. లేబర్కాంట్రాక్టర్ సునీల్కుమార్ తక్కువ కూలీకి తీసుకొచ్చి కంపెనీ యాజమాని వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నడని సమాచారం. కాగా బాలకార్మికులను దవాఖానకు తీసుకెల్లి వైద్య పరీక్షలు చేయించి నగరంలోని చైల్డ్హోంకు తరలించారు. కంపెనీ యాజమని, లేబర్ కాంట్రాక్టర్పైన కేసులు నమోదు చేసినట్లు ఇబ్రహీంపట్నం సీఐ సైదులు తెలిపారు.