Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్లో ఘరానా మోసం బయటపడింది. ఒక వ్యక్తి తాను ఐఏఎస్ అధికారిని అని నమ్మించి, ఒక యువతిని పెళ్లి చేసుకున్నాడు. మరునాడే పెళ్లి కూతురును అమ్మేసేందుకు ప్రయత్నించాడు. ఆ యువతి కుటుంబ సభ్యుల జోక్యంతో ఈ విషయం బయటపడింది. ఉత్తర ప్రదేశ్లోని ఘోరక్పూర్లో ఇటీవల ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటావాకు చెందిన ప్రీతమ్ కుమార్ నిషద్ అనే వ్యక్తి తాను ఐఏఎస్ అధికారిని అని చెప్పుకొంటూ ఒక పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు.
తను ఐఏఎస్ అని నమ్మించేందుకు కొందరు అధికారులు, రాజకీయ నాయకులతో తీయించుకున్న ఫొటోలు, వీడియోలను వధువు కుటుంబ సభ్యులకు పంపించాడు. అలాగే, ప్రీతమ్ కుటుంబం కూడా అలాగే పోజు కొట్టింది. దీంతో ప్రీతమ్ నిజంగానే ఐఏఎస్ అధికారి అయ్యుంటాడని వధువు కుటుంబం భావించింది. వధువు కుటుంబ సభ్యులతో పెళ్లి సంబంధం మాట్లాడే సమయంలో తనకు వరకట్నం ఏమీ అవసరం లేదన్నాడు. దీంతో వధువు కుటుంబం అతడితో పెళ్లికి తొందరపడింది. లేదంటే ఎక్కడ సంబంధం చేజారిపోతుందో అని భయపడ్డారు. అంతేకాదు.. అతడు ఐఏఎస్ అవునా, కాదా అని మాత్రం ఆరా తీయలేదు. ఎలాగైతేనేం, ఐఏఎస్గా నమ్మించిన ప్రీతమ్కు తమ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేందుకు వధువు కుటుంబం అంగీకరించింది. అయితే, పెళ్లి సమయంలో వరుడి కుటుంబం డబ్బులు కావాలని డిమాండ్ చేసింది.
కట్నం అవసరం లేకపోయినా, పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ.15 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. దీనికి అమ్మాయి కుటుంబం మొదట షాకైనా, ఐఏఎస్ సంబంధం కావడంతో చివరకు ఒప్పుకొన్నారు. పెళ్లికి ముందు రూ.10 లక్షలు, పెళ్లి రోజు మరో రూ.5 లక్షలు ఇచ్చారు. ఇక, పెళ్లికి కూడా రూ.15 లక్షలు ఖర్చు పెట్టారు. మొత్తంగా రూ.30 లక్షల ఖర్చుతో ఈ నెల 11న వివాహం జరిగింది. మరుసటి రోజు వధువు తన ఇంటి నుంచి అత్తవారింటికి బయల్దేరింది. అప్పుడే మొదలైంది అసలు కథ. అత్తవారింటికి చేరుకునే వరకు ఆమెపై అక్కడివారు లైంగికదాడికి యత్నించారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఒక గదిలో బంధించారు. అయితే, ఎలాగోలా ఈ విషయాన్ని ఆ వధువు తన తల్లిదండ్రులకు చేరవేసింది. దీంతో హుటాహుటిన ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఆమె ఉండే ఇంటికి చేరుకున్నారు. గదిలోంచి ఆమెను రక్షించారు. వారు రావడం చూసిన వరుడు, అతడి సోదరి ఇద్దరూ అక్కడినుంచి పారిపోయారు. ఈ సందర్భంగా వారికి మరో షాకింగ్ విషయం బయటపడింది.
నిజానికి నూతన వధువును వారు అమ్మేయాలనుకున్నారు. ఈలోపే ఆమె తల్లిదండ్రులు రావడంతో వారి ప్లాన్ బెడిసికొట్టింది. ఈ దారుణంపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రీతమ్, అతడి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే ప్రీతమ్ను, ఇతర నిందితులను పట్టుకుంటామని ఎస్పీ కౌస్తుభ్ తెలిపారు. ఇందులో మానవ అక్రమ రవాణా కూడా ఉండటంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.