లక్నో : సైబర్ నేరాల పట్ల పోలీసులు, ప్రభుత్వ అధికారులు ప్రజల్లో అవగాహన పెంచుతున్నా ఆన్లైన్ స్కామ్లు (Online Scam) గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా లక్నోలోని ప్రగ్ నారాయణ్ రోడ్ నివాసి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాం కున్వర్ స్కామర్ల చేతిలో రూ. 5 లక్షలు నష్టపోయారు. బాధిత అధికారికి అక్టోబర్ 3న తన ఖాతాలో రూ. 29.78 కోట్ల క్రెడిట్ అయ్యాయనే మెసేజ్ వచ్చింది. తన ఖాతాలో ఊహించని మొత్తం జమకావడంతో కున్వర్ వెంటనే సెంట్రల్ బ్యాంక్ జాప్లింగ్ రోడ్ బ్రాంచ్ను సందప్రదించారు. ఈ మెసేజ్ను బ్యాంక్ నుంచి పంపలేదని నిర్దారించిన బ్యాంక్ మేనేజర్ ఆపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
బ్యాంక్ నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో కున్వర్ ఈ అంశాన్ని బ్యాంక్ జోనల్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించాడు. చివరికి జోనల్ మేనేజర్ కూడా ఆయనకు ఎలాంటి సాయం చేయకపోగా, బ్యాంక్లోనే తన జూనియర్ అధికారిని ఆ విషయం చూడాలని పురమాయించాడు. ఈ క్రమంలో బ్యాంక్ సీనియర్ అధికారినని చెప్పుకుంటూ అవినాష్ అనే వ్యక్తి నుంచి కున్వర్కు ఫోన్ కాల్ వచ్చింది.
రూ. 29.78 కోట్లు క్రెడిట్ అయ్యాయనే మెసేజ్ పొరపాటున వచ్చిందని, ఎనీడెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని బాధితుడిని కోరాడు. దీంతో సెంట్రల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఖాతాలతో పాటు కున్వర్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి సున్నిత సమాచారం అంతా అవినాష్ అనే వ్యక్తి సంగ్రహించాడు. వెనువెంటనే సెంట్రల్ బ్యాంక్ ఖాతా నుంచి రూ. 4.65 లక్షలు, యూనియన్ బ్యాంక్ ఖాతా నుంచి రూ. 50000 డెబిట్ అయినట్టు కున్వర్కు మెసేజ్ వచ్చింది. ఆన్లైన్ స్కామ్కు గురయ్యానని గ్రహించిన కున్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read More :