శేరిలింగంపల్లి, ఆగస్టు 24: మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన హోటల్ మేనేజర్ హత్య కేసును సైబరాబాద్ పోలీసులు ఎనిమిది గంటల్లో ఛేదించారు. నిందితుడిని గురువారం ఉదయం ఆరు గంటలకు అరెస్టు చేశారు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గచ్చిబౌలిలోని కార్యాలయంలో మాదాపూర్ డీసీపీ జి.సందీప్రావు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన దెబేందర్ గయాన్ (35) బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి అల్వాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. మియపూర్లోని సందర్శిని ఎలైట్ హోటల్లో పనిచేస్తున్నాడు. దెబేందర్ గయాన్ స్నేహితుడైన పశ్చిమబెంగాల్కు చెందిన రితీష్ నాయర్(42) సైతం సందర్శిని హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు.
కాగా, హోటల్ మేనేజర్ ఉద్యోగం విషయంలో ఇద్దరికీ తీవ్ర పోటీ ఉండేది. దెబేందర్ గయాన్ హోటల్లో మంచిగా పనిచేస్తూ.. అందరి ప్రశంసలు పొందుతుండటంతో నెలన్నర కిందట యాజమాన్యం అతడిని హోటల్ మేనేజర్గా నియమించింది. అప్పటి వరకు హోటల్ మేనేజర్గా విధులు నిర్వర్తించిన రితీష్ నాయర్ను మేనేజర్ ఉద్యోగం నుంచి తప్పించారు. ఈ క్రమంలో వీరిద్దరికీ తరచూ గొడవలు జరిగాయి. ఇది గమనించి హోటల్ యాజమాన్యం నెలన్నర కిందట రితీష్నాయర్ను ఉద్యోగం నుంచి పూర్తిగా తొలిగించారు. దెబేందర్ గయాన్ వల్లే తన మేనేజర్ ఉద్యోగం పోయిందని కక్ష పెంచుకున్న నిందితుడు రితీష్నాయర్ అతడిని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.
ఈ క్రమంలో రితీశ్ నాయర్ నెలకిందట బీహార్కు వెళ్లి.. అక్కడ నాటు పిస్టల్ కొనుగోలు చేసి నగరానికి తిరిగి వచ్చాడు. తనకు అడ్డువచ్చిన దెబేందర్ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. అతడు డ్యూటీకీ వచ్చే సమయం, ఇంటికి వెళ్లే సమయాలను గుర్తించి రెక్కీ నిర్వహించాడు. పథకం ప్రకారం బుధవారం రాత్రి 7.30 గంటలకు మియాపూర్ సందర్శిని హోటల్లోని పార్కింగ్లో హెల్మెట్ పెట్టుకొని దెబేందర్ గయాన్ కోసం రితీష్నాయర్ కాపుకాశాడు. రాత్రి 9.30 గంటల సమయంలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు బైక్ స్టార్ట్ చేస్తున్న దేబేందర్పై ఆరు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యాడు. ఓ రౌండ్ బుట్లెట్ గాలిలోకి వెళ్లగా.. మిగతా ఐదు రౌండ్లు దేబేందర్ శరీరంలోకి దూసుకెళ్లాయి.
దీంతో అక్కడే కుప్పకూలీపోయిన అతడిని హోటల్ సిబ్బంది చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని పట్టుకునేందుకు ఆరు బృందాలను రంగంలోకి దింపారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి కేసు దర్యాప్తు ముమ్మురం చేశారు. కేరళాకు వెళ్లేందుకు మెట్రోస్టేషన్లో వేచి ఉన్న నిందితుడు రితీశ్నాయర్ను గుర్తించారు. గురువారం ఉదయం 6 గంటలకు స్థానిక మెట్రోస్టేషన్లో అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్దనుంచి ఓ దేశవాళి పిస్టల్, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో మాదాపూర్ అడిషనల్ డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి, మియాపూర్ ఏసీపీ హనుమంతా రావు, ఇన్స్పెక్టర్ ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.