అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్నవాడే ఉన్మాదిలా మారి భార్య గొంతుకోసి హతమార్చేందుకు యత్నించాడు. యడ్లపాడు మండలం బోయపాలెంలో ఈ దారుణ ఘటన జరిగింది. వివరాలివి.. ఒడిశా రాష్ట్రానికి చెందిన రీటా-గనూన్ దంపతులు. ఉపాధి నిమిత్తం కొంతకాలం క్రితం వీరు గుంటూర్ జిల్లాలోని బోయపాలెం వచ్చారు.
అక్కడే అద్దెకు ఉంటూ స్థానికంగా ఓ స్పిన్నింగ్ మిల్లో పనిచేస్తున్నారు. కొన్నిరోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ కూడా వీరి మధ్య గొడవ జరగడంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన గనూన్ ఇంట్లోనే భార్య రీటా గొంతు కోశాడు.
పరారయ్యేందుకు యత్నిస్తుండగా గుర్తించిన స్థానికులు నిందితుడిని పట్టుకొని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం హుటాహుటిన చిలకలూరి పేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.