షాజహాన్పూర్ : మగబిడ్డను కనలేదన్న కోపంతో భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడో భర్త. ముగ్గురు ఆడపిల్లలే పుట్టారన్న కోపంతో ఆమెపై సలసలకాగే నీళ్లు పోశాడు. ఈ ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో ఈ అమానవీయ ఘటన జరిగింది. షాజహాన్పూర్కు చెందిన సత్యపాల్కు 2013లో సంజు అనే మహిళతో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. ముగ్గురు కుమార్తెలే పుట్టడంతో పుట్టింటి నుంచి రూ. 50 వేలు తీసుకురావాలంటూ కొంతకాలంగా సత్యపాల్ భార్యను వేధిస్తున్నాడు. ఇటీవల ఆమెకు భోజనం కూడా పెట్టడం లేదు. ఈ నెల 13 ఇంట్లో ఉన్న భార్యతో వాగ్వాదానికి దిగిన సత్యపాల్ ఆవేశంలో వేడినీళ్లు పోశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడటంతో స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన దవాఖానకు తరలించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.