కొల్లాపూర్ రూరల్ : నవమాసాలు మోసి కన్న ఇద్దరు పిల్లలను.. కట్టుకున్నవాడే కడతేర్చడాన్ని ఆ భార్య భరించలేకపోయింది. కట్టుకున్నవాడిపైనే ప్రతీకారానికి దిగి.. గొంతుకోసి హత్య చేసింది. ఈ విషాదకర ఘటన కొల్లాపూర్ మండలం కుడికల్ల గ్రామంలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. కుడికల్ల గ్రామానికి చెందిన ఓంకార్, అదే గ్రామానికి చెందిన మహేశ్వరి ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి చందన (3), విశ్వనాథ్ (1) పిల్లలు ఉన్నారు. నెల రోజుల కిందట భార్య, పిల్లలపై అనుమానంతో మూడో సంతానం కావాలని భార్యను కోరాడు.
ఇందుకు నిరాకరించడంతో.. కోపంతో ఎత్తం గ్రామ సమీపంలోని గట్టు ప్రాంతంలో ఇద్దరి పిల్లలను కర్కశంగా కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఓంకార్ సైతం గొంతు కోసుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని జిల్లాకేంద్రంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరుణంలోనే పాలమూరు ఆసుపత్రిలో కోలుకున్న తర్వాత ఓంకార్ శుక్రవారం సాయంత్రం కుడికిల్లలోని ఇంటికి వచ్చాడు.
ఇంటికి వచ్చాక సైతం మళ్లీ వేధింపులకు దిగడం, పిల్లలను తనకు దూరం చేశాడన్న కోపంతో మహేశ్వరి ఆదివారం ఉదయం ఓంకార్ నిద్రిస్తున్న సమంలో గొంతు కోసి హత్య చేసింది. ఆ తర్వాత కొల్లాపూర్ పోలీస్స్టేషన్లో లొంగిపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు అదనపు ఎస్పీ రామేశ్వర్, సీఐ యాలాద్రి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.